సాగు చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రాజీనామా!

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. హరియాణాలో ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. భారత జాతీయ లోక్‌దల్‌(ఐఎన్‌ఎల్‌డీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే అభయ్‌ చౌటాలా తన రాజీనామా లేఖను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జ్ఞాన్‌ సింగ్‌ గుప్తాకు అందజేశారు.

Published : 28 Jan 2021 01:16 IST

ఛండీగఢ్‌: కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. హరియాణాలో ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. భారత జాతీయ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే అభయ్‌ చౌటాలా తన రాజీనామా లేఖను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జ్ఞాన్‌ సింగ్‌ గుప్తాకు అందజేశారు. చౌటాలా తన అనుచరులతో కలిసి ట్రాక్టర్‌పై విధానసభకు వచ్చి స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. కాగా ఆయన రాజీనామాను స్పీకర్‌ గుప్తా ఆమోదించినట్టు స్పీకర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘ఎల్లానాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభయ్‌ సింగ్‌ చౌటాలా కొద్ది సేపటి క్రితం తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన నాకు ఇచ్చిన రాజీనామా లేఖలోని అంశాలు అన్ని విధాలుగా సరైన పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించాం. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు నిరాకరిస్తున్నందునే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు’ అని స్పీకర్‌ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా చౌటాలా మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనపై భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే సాగు చట్టాల రద్దుకే గత నెలలో చౌటాలా స్పీకర్‌కు లేఖ రాయగా.. ఆయన తండ్రి, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా ప్రధాని మోదీకి లేఖ రాశారు. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.  రైతులు ఎర్రకోటపై  రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి

ఫిట్‌మెంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామా: సంజయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని