Jaggareddy: త్వరలో పార్టీ పదవులకు రాజీనామా.. స్వతంత్రంగా ప్రజా సేవ చేస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

జీవితంలో కాంగ్రెస్‌ను విడిచిపోవాలని లేకుండే... కానీ, తాజా పరిస్థితులు తనను అటు వైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే

Updated : 19 Feb 2022 17:35 IST

హైదరాబాద్‌: జీవితంలో కాంగ్రెస్‌ను విడిచిపోవాలని లేకుండే... కానీ, తాజా పరిస్థితులు తనను అటు వైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానని ప్రకటించారు. ‘దయచేసి నన్ను ఎవరూ కలవొద్దు.. నా వల్ల పార్టీకి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి నష్టమైందనే భావనలో ఉన్న నాయకులు, కార్యకర్తలంతా రాజకీయంగా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఘన చరిత్ర గల కుటుంబం... సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ అంటే తనకు చాలా ఇష్టం, గౌరవం అని స్పష్టం చేశారు. తాను స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకున్నా సోనియా, రాహుల్‌ను గౌరవిస్తూనే ఉంటానని... ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత క్షణం నుంచి తాను కాంగ్రెస్‌ గుంపులో లేనని వెల్లడించారు. 

నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఈ నిర్ణయం..
‘మీడియా దృష్టిలో పడేందుకే మాట్లాడతాననడం సరికాదు. ఏదైనా కోపముంటే నేరుగా చెప్పడం నా వ్యక్తిత్వం. నిర్మోహమాటంగా మాట్లాడతాను కాబట్టే నా మీద మీడియా దృష్టి ఉంటుంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాను. పదవులు ఆశించడం, అందుకోసం ప్రయత్నించడం రాజకీయాల్లో సహజం. కానీ, నామీద కోవర్టు అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. నేను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తు్నారు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో పార్టీ వీడాలనుకున్నా. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లినా .. వేరే పార్టీలో చేరను. సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, వీహెచ్‌తో పాటు పలువురు నేతలు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నాకు చెప్పారు. బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చాలా మంది నేతలు చెప్పారు. వారికి నచ్చజెప్పిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రెండు..మూడు రోజులు ఆగుతున్నా. లేకపోతే ఇప్పుడే రాజీనామా చేసే వాణ్ని. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా, నేను పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టం లేదు’’ అని జగ్గారెడ్డి వివరించారు.

సోనియా, రాహుల్‌ గాంధీకి లేఖ..

తాజా పరిణామాల నేపథ్యంలో సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖలు రాశారు. తాను ఏ తప్పూ చేయలేదని, సొంత పార్టీలో కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా తెరాస కోవర్టు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్‌లో లేకపోవడం దురదృష్టకరమని సోనియా, రాహుల్‌కు రాసిన సుదీర్ఘ లేఖలో వాపోయారు. వేరే రాజకీయ పార్టీ తనను పిలిస్తే అమ్ముడుపోయాడనే ఒక చరిత్ర ఉంటుందనే వెళ్లలేదని, ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోవర్టు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అమ్ముకోనని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. హుందాగా బతుకుదాం అనుకున్న కాంగ్రెస్‌ పార్టీలో తనపై కోవర్టు అనే ప్రచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్న మూర్ఖులు ఆలోచన చేయాలని హితవుపలికారు. వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే నేరుగా వెళతా కదా? ఇక్కడే ఉండి కోవర్టు అని ప్రచారం చేయించుకునే కర్మ తనకెందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుందని చెబితే అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు.. కానీ, ఇప్పుడు అయ్యో జగ్గారెడ్డి చెప్పింది నిజమే కదా! రాజకీయంగా దెబ్బతిన్నామనే భావనలో ఉన్నారని చెప్పారు. ఈ పనికి మాలిన నిందలతో ఆవేదన చెందడం కంటే మనస్సాక్షికి కట్టుబడి స్వతంత్రంగా రాజకీయ జీవితం గడపడం మేలని నిర్ణయం తీసుకున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని