Jairam Ramesh: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా: జైరాం రమేశ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు.

Updated : 12 Oct 2022 10:55 IST

కర్నూలు (విద్యావిభాగం): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. త్వరలో ఏపీలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జైరాం రమేశ్‌ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ఈనెల 18న ఏపీలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అనంతరం తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని ఆయన వివరించారు. 

మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో కుల, మతాల మధ్య భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. విభజించు, పాలించు అనే నినాదంతో ఆ పార్టీ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు తులసిరెడ్డి, హర్షకుమార్‌తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్‌, సుదాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని