
AP News: పొత్తులపై స్పందించిన పవన్ కల్యాణ్
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. ఇప్పటికే జనసేన పార్టీ భాజపాతో పొత్తులో ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేసినందుకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్... పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని వెల్లడించారు. ప్రతి జనసేన కార్యకర్త ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకున్నాకే 2024 ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండాలనేది నిర్ణయించుకుందామని తెలిపారు. అప్పటి వరకు పార్టీ శ్రేణులంతా ఒకే మాట మీద ఉండాలని సూచించారు. పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కల్యాణ్.. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని తెలిపారు.
ఈ క్రమంలో రకరకాల పార్టీలు జనసేనతో పొత్తు కోరవచ్చన్న పవన్.. మిగతా పార్టీల మైండ్ గేమ్లో జనసైనికులు పావులుగా మారవద్దని హితవు పలికారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఏడాదిలోగా సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను పూర్తి చేసుకుందామని తెలిపారు. గతేడాది కొవిడ్ కారణంగా పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోలేదని, ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని శ్రేణులకు వివరించారు. కమిటీ దిశా నిర్దేశం మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. ఆ సభలో 2024 ఎన్నికలకు కావాల్సిన ఆలోచనలు చేయనున్నట్టు చెప్పారు. సంక్రాంతి తర్వాత మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.