జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం: జనసేన

ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ..

Updated : 19 Jun 2021 11:54 IST

అమరావతి: ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10,143 ఉద్యోగాలనే భర్తీ చేస్తామని ప్రకటించడం ద్వారా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన వైకాపా.. చివరికి గ్రూప్‌-1, గ్రూప్-2 విభాగాల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చూపించిందని మండిపడ్డారు. ప్రకటన లక్షల్లో ఉండి.. భర్తీ మాత్రం నామమాత్రంగా ఉందని ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్రంలో 2.59 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేశామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఇదే వాలంటీర్లు జీతాలు పెంచాలని ఆందోళనకు సిద్ధమైతే.. మీవి ఉద్యోగాలు కావు.. స్వచ్ఛంద సేవ మాత్రమే అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్ ప్రచారం కోసం మాత్రం వాళ్లవి ఉద్యోగాలు అని చెబుతున్నారు. ఆర్టీసీలో 51 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా కొత్తగా నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉంది. తప్పుడు ప్రకటన ద్వారా వైకాపా ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలని చూస్తోంది’’ అని నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని