JDS-BJP: జేడీఎస్‌.. భాజపాకు దగ్గరవుతోందా..?

రాజకీయాల్లో పొత్తులు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రస్తుతం జేడీఎస్(JDS) పార్టీ వైఖరి చూస్తుంటే.. భాజపాకు దగ్గరవుతోందా..? అనిపిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. అది నిజమేనని అనిపిస్తోంది.  

Published : 07 Jun 2023 17:37 IST

దిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్‌ సెక్యులర్(JDS) ఆశించిన సీట్లను పొందలేకపోయింది. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిద్దామనుకున్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.  224 అసెంబ్లీ స్థానాలకుగానూ 19 మాత్రమే దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ పార్టీ ఇప్పుడు భాజపా వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జేడీఎస్‌ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ(HD Deve Gowda) చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన(Odisha Train Tragedy) దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్రంగా ధ్వంసమైన పట్టాలు పునరుద్ధరించిన తర్వాత మళ్లీ రైళ్ల రాకపోకలు  సాగే వరకు రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్ అక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షించారు. దీనిపై దేవెగౌడ స్పందించారు. ‘ఈ క్లిష్టసమయంలో ఆయన నిర్విరామంగా పనిచేశారు. మంత్రి గొప్ప పనితీరు చూపారు. ఈ సమయంలో ఆయన రాజీనామా కోరడం తెలివైన పనికాదు’అని ఇటీవల రైల్వే మంత్రి పనితీరును మెచ్చుకున్నారు. 

అలాగే దేశంలోని ప్రతిపక్షాల తీరును విమర్శించారు.‘ఈ దేశ రాజకీయాల గురించి విశ్లేషించగలను. కానీ ఏం లాభం? భాజపాతో సంబంధాలు లేని ఒక్కపార్టీని చూపించండి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు కలిగిఉన్నాయి.  అలాలేని పార్టీని చూపించండి. అప్పడు నేను సమాధానం చెప్తా’అని అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలను ఒక్కదగ్గరకు చేర్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ చేస్తోన్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే..  భాజపాకు జేడీఎస్ దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. గత నెల దేవెగౌడ పుట్టినరోజుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. 2006లో కర్ణాటకలో భాజపా, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండగా.. బీఎస్ యడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పవర్‌ షేరింగ్ ఫార్ములా విఫలం కావడంతో 20 నెలల్లో ఆ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. భాజపాకు అధికారాన్ని బదిలీ చేయడానికి జేడీఎస్ నిరాకరించడమే అందుకు కారణం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని