Munugode Bypoll Results: నోటాకు 482.. కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లంటే..!

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. విస్త్రృత ప్రచారం నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ కేవలం 805 ఓట్లు సాధించారు.

Published : 06 Nov 2022 21:44 IST

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి  తనదైన శైలిలో వినూత్న ప్రచారం చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ ప్రసార మాధ్యమాల దృష్టిని ఆకర్షించారు. ఒక రోజు రైతు వేషంలో, మరో రోజు గొర్రెల కాపరి వేషధారణలో ప్రజల వద్దకు వెళ్లారు. నవంబర్‌ 3న పోలింగ్‌ రోజు 100 పోలింగ్‌ కేంద్రాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుని హడావుడి చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా సమయం లేదంటూ పోలింగ్‌కేంద్రాల వద్ద పరుగెత్తి  హల్‌చల్‌ చేశారు.

అప్పుడప్పుడు పోలీసులు, అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ .. ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో తనదైన ముద్ర వేశారు కేఏ పాల్‌. ఇంత చేసినా చివరికి ఆయన  కేవలం 805 ఓట్లు మాత్రమే సాధించారు. అన్ని రౌండ్లలోనూ రెండు అంకెల సంఖ్యకే పరిమితమయ్యారు.  అత్యధికంగా 13వ రౌండ్‌లో 86 ఓట్లు, అత్యల్పంగా 15వ రౌండ్‌లో 11 ఓట్లు సాధించారు. ఇంత జరిగినా కేఏ పాల్‌  తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని,  వీవీప్యాట్‌లోని స్లిప్పులు లెక్కిస్తే తనకు లక్ష ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో కొన్ని ఖాళీ ఈవీఎంలు పెట్టారని, వాటిని కౌంటింగ్‌ ఈవీఎంల్లో కలిపేశారని సంచలన  ఆరోపణలు చేశారు.

నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

 ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులు  తమకు నచ్చని పక్షంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటా ఆప్షన్‌ను అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో 482 మంది నోటా ఆప్షన్‌ను ఎంచుకున్నారు. మరోవైపు బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి శంకరాచారి 4145 ఓట్లు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని