​​​​​​మేనిఫెస్టో విడుదల చేసిన కమల్‌ హాసన్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం విడుదల చేశారు. గృహిణులకు ఆదాయ......

Updated : 19 Mar 2021 18:08 IST

కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం విడుదల చేశారు. గృహిణులకు ఆదాయం అందించే హామీని ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. వారి నైపుణ్యాలకు తగిన ఆదాయం లభించేలా చేస్తామని, అంతే తప్ప ఉచితంగా పంపిణీ చేయడం కాదని స్పష్టంచేశారు. వారి పని, నైపుణ్యానికి గానూ నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఆదాయం పొందేలా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కమల్‌ హామీ ఇచ్చారు. గృహిణులకు వేతన అంశాన్ని తొలుత డిసెంబర్‌లో కమల్‌ ప్రస్తావించారు. అది ఏవిధంగా ఇస్తామనేది తాజా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం ఉండబోదని, ప్రతి మహిళా తమ నైపుణ్యం, పనికి తగిన వేతనం పొందుతారని వివరించారు.

234 నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలను స్వయం సమృద్ధి సాధించేలా ఏర్పాటు చేస్తామని కమల్‌ హామీ ఇచ్చారు. ఇది అందిరిలా ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన మేనిఫెస్టో కాదంటూ డీఎంకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాత్కాలిక సమస్యలకు పరిష్కారం కాకుండా.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మేనిఫెస్టో అని చెప్పారు. తమిళనాడును రాబోయే పదేళ్లలో 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని వివరించారు. మెడికల్‌ విద్యార్థులకోసం నీట్‌ బదులు సీట్‌ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యా రుణాలపై మొదటి మూడేళ్ల వరకు వడ్డీ మాఫీ అందిస్తామని, చదువు తర్వాత ఉద్యోగం పొందడంలో విఫలమైతే ఆ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని