Uttarakhand: ఉచిత విద్యుత్‌..నిరుద్యోగ భృతి..ఉత్తరాఖండ్‌లో కేజ్రీవాల్‌ ఎన్నికల హామీలు

ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా వంటి హామీలు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది....

Published : 20 Sep 2021 01:46 IST

దెహ్రాదూన్‌: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)’ అనేక హామీలు ప్రకటించింది. రాష్ట్ర నుంచి వలసల్ని అరికట్టేందుకు చర్యలు చేపడతామని పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీనిచ్చారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా వంటి హామీలు గుప్పించారు.

ఆప్‌ అధికారంలో వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. లేదంటే ప్రతి కుటుంబంలోని ఒక నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.5,000 భృతి కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు. దిల్లీ తరహాలో నిరుద్యోగులకు.. సంస్థలకు మధ్య వారధిగా ఓ వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులు, వలసల సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత కరెంటు వంటి గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చి తీరతామన్నారు. దిల్లీలో అదే చేస్తున్నామని.. ఉత్తరాఖండ్‌లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తామన్నారు. 2015లో దిల్లీలో అధికారంలో వచ్చినప్పుడు.. హామీలను నిలబెట్టుకోవడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రతిపక్షాలు నిలదీశాయన్నారు. కానీ, నాలుగేళ్లలో లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా మార్చి నిరూపించుకున్నామన్నారు. అవినీతిని అంతం చేస్తే వ్యవస్థలన్నీ దానంతట అవే గాడిలో పడతాయన్నారు. ప్రస్తుతం, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉత్తరాఖండ్‌ వనరుల్ని దోచుకోవడంలోనే నిమగ్నమయ్యాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

దిల్లీలో పాలన విజయవంతంగా కొనసాగుతోందని కేజ్రీవాల్‌ అన్నారు. దేశ రాజధానిలో 73 శాతం మంది ప్రజలకు ఉచిత విద్యుత్తు అందుతోందన్నారు. దిల్లీ అభివృద్ధి నమూనానే ఉత్తరాఖండ్‌లోనూ అమలు చేస్తామన్నారు. 21 ఏళ్లుగా ఉత్తరాఖండ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని 21 నెలల్లో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ఆప్‌ అభ్యర్థి అజయ్‌ కొఠియాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని