కేరళ రాజకీయం.. వివాదాల మయం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య త్వరలో జరిగే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి....

Published : 28 Mar 2021 12:55 IST

నకిలీ ఓట్లు, ఐటీ దాడులతో గరంగరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య త్వరలో జరిగే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. కేరళలో బోగస్‌ ఓట్లను సృష్టించి విజయం సాధించాలని అధికార కూటమి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమను అభాసుపాలు చేయాలని యూడీఎఫ్‌, భాజపా ప్రయత్నిస్తోందని ఎల్డీఎఫ్‌ ఆరోపిస్తోంది. నకిలీ ఓట్లు.. ఐటీ, ఈడీ దాడుల మధ్య కేరళ రాజకీయం మునుపెన్నడూ లేనంత రక్తికడుతోంది. 

కేరళలో ఎక్కువ సంఖ్యలో నకిలీ ఓట్లను సృష్టించి అధికార ఎల్డీఎఫ్‌ విజయం సాధించాలని భావిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ కూటమి ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కలిపి 4 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై నిజానిజాలు తేల్చాలని కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ కూటమి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విపక్ష నేత రమేష్‌ చెన్నితాల ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. నకిలీ ఓట్ల ద్వారా అధికార ఎల్డీఎఫ్‌ తిరిగి అధికారం చేపట్టేలా ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నకిలీ ఓట్లపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అధికార ఎల్డీఎఫ్‌ ఖండించింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

మరోవైపు అధికార ఎల్డీఎఫ్‌కు చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు(కేఐఐఎఫ్‌బీ)పై ఐటీ దాడులు జరగడం తీవ్ర దుమారం రేపింది. ఈ దాడులను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గురువారం తిరువనంతపురంలోని కేఐఐఎఫ్‌బీపై ఐటీ అధికారులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందాలను పావులుగా వాడుకుంటున్నారని ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ బహిరంగంగానే విమర్శలు చేశారు. దాడులపై న్యాయ విచారణకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సమావేశమైన కేరళ కేబినెట్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కేవీ మోహనన్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

యూడీఎఫ్‌ నోట భాజపా స్వరం వినిపిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఆరోపించారు. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు బదులు పార్టీలు నిందారోపణలకే ఎక్కువ సమయం కేటాయించడం ఆయా  పార్టీల విజయావకాశాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని