KishanReddy: ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది.. కిషన్‌రెడ్డి భావోద్వేగ ప్రసంగం

అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లిదగ్గరకు వచ్చినట్లుఉందని ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్‌ సభ శనివారం ఒకప్పుడు.....

Updated : 24 Sep 2022 17:02 IST

హైదరాబాద్‌: అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్ సభ శనివారం గతంలో తన సొంత నియోజకవర్గమైన అంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే. కేంద్రమంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తా. అంబర్‌పేట నాకు తల్లిలాంటిది. ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది. పార్టీ.. అంబర్‌పేట నాకు రెండు కళ్లతో సమానం’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘దేశంలో కరోనా నుంచి కాపాడేందుకు 57కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాం.  130 కోట్ల మందికి రెండు డోసులూ చివరి వ్యక్తి వరకు ఉచితంగా టీకా అందిస్తాం. ప్రజల ప్రాణాల్ని కాపాడతాం. పేద ప్రజలు కొవిడ్‌తో ఇబ్బంది పడకూడదని గతేడాది ఏప్రిల్‌ నుంచి దేశంలోని 80కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. వచ్చే దీపావళి వరకు ఇస్తాం.. ఇంకా అవసరమైతే దాన్ని మరింత కాలం పొడిగిస్తాం’’ అని పేర్కొన్నారు. 

మాస్క్‌లు పెట్టుకోండి.. ఎవరికీ ఏం కాదు

‘‘అందరూ మాస్క్‌ పెట్టుకోండి. ఏడాదిన్నర నుంచి నేను ఇంట్లో తప్ప మాస్క్‌ తీయలేదు. గాంధీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల వార్డుకు తొమ్మిదిసార్లు వెళ్లాను. మాస్క్‌ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా గనకే కరోనా నన్నేమీ చేయలేదు. నేను కరోనాని జయించాను. రాష్ట్రంలో ఎన్నో ఆస్పత్రులు తిరిగా.. రోగులను కలిశా.. మందులు తీసుకొచ్చా.. ఆక్సిజన్‌ తెచ్చా.. ఆక్సిజన్‌ ప్లాంట్‌ తీసుకొచ్చా. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. మాస్క్‌లు పెట్టుకోండి. ఎవరికేం కాదు. మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండండి’’ అని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

‘‘వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తేవాలని గతంలో పనిచేస్తే దురదృష్టవశాత్తు కాలేదు. కేంద్ర పర్యాటకమంత్రి అయ్యాక ప్రధాని మోదీతో మాట్లాడాను. ఏ దేశాలైతే ప్రపంచ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించాయో.. ఆ దేశాలను ఒప్పించేలా చేయగలిగాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్‌పేట బిడ్డ కూడా కీలక పాత్ర పోషించారు. గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తా. అంబర్‌పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అన్నారు.

గల్లీగల్లీ తిరగాలని మనసులోఉంది.. కానీ!

గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్‌పేటలో గల్లీ గల్లీ తిరిగినట్టు ఇప్పుడూ తిరగాలని నాకు మనసులో ఉంది. కానీ సమయం సహకరించడం లేదు. బాధ్యత పెద్దది. దిల్లీలో ఉండాలి.అందరినీ కలవాలి. అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించాలి.నన్ను భవిష్యత్తులోనూ మీరంతా ఆశీర్వదించాని కోరుకుంటున్నా..’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని