KishanReddy: రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుంది: కిషన్‌రెడ్డి

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ మధ్య ఒప్పందం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. 

Updated : 07 Mar 2023 19:08 IST

హైదరాబాద్‌: కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు భారాసకు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిచారు. సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి 12 అంశాలపై లేఖాస్త్రాలు సంధించారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్‌ పనులకు సహకరించాలని, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరారు. సైనిక స్కూల్‌, సైన్స్‌ సిటీ కోసం భూమి కేటాయించాలని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. రైల్వేల పురోగతికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1,250 కోట్లు విడుదల చేసిందని, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో డీపీఆర్‌ మంజూరైందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ మధ్య ఒప్పందం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుందని ఆరోపించారు. ఫలక్‌నుమా వరకు రావాల్సిన మెట్రోను అప్జల్‌గంజ్‌ వద్దే ఆపారని, పాతబస్తీకి మెట్రో రాకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయాల కోసం భాజపాని విమర్శించండి కానీ, పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు కేంద్రానికి సహకరించాలని కోరారు. అబద్ధాలకు మంత్రి కేటీఆర్ మారు పేరని, మసిపూసి మారేడుకాయ చేస్తారని విమర్శించారు.

దళిత విద్యార్థుల జాబితా కేంద్రానికి ఇవ్వకపోవడంతో ఈ విద్యాసంవత్సరం వారికి ఇవ్వాల్సిన స్కాలర్‌ షిప్స్‌ అందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇదే ప్రభుత్వం కొనసాగితే తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలకు తిరిగి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. లేఖలు రాస్తే రిప్లై ఇచ్చే సంస్కారం కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకుని.. గొంతు చించుకుంటే లాభం లేదన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు