Kishan Reddy: దొరికిందని చెబుతున్న డబ్బెంత?ఎక్కడి నుంచి తెచ్చారు?: కిషన్‌రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే కొత్త నాటకానికి తెరతీశారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సీఎం పదవి ఊడుతుందని కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. తెరాస నీతి మాటలు చెప్పడం హాస్యా్స్పదంగా ఉందన్నారు.

Updated : 27 Oct 2022 15:13 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే తెరాస కొత్త నాటకానికి తెరతీసిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. తెరాస ఎమ్మెల్యేలకు రూ.వందల కోట్లు ఇవ్వడానికి భాజపా కుట్ర చేసిందంటూ ఆరోపణలు చేశారని.. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపించిందంటూ ప్రజల ముందు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దిష్టిబొమ్మలను సైతం మంత్రులే తగులబెట్టారని మండిపడ్డారు.

దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత?

‘‘తెరాస రూ.వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని సర్వేలు తేల్చిచెప్పాయి. దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత?ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదు? దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేక కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి వచ్చిందా? పార్టీ ఫిరాయించిన వారికి పెద్దపీట వేసింది తెరాస అనే విషయాన్ని గ్రహించాలి. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకున్నది తెరాస కాదా? చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా? ఇంద్రకరణ్‌ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచారు? పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేసేది కేసీఆరే. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలోకి చేర్చుకున్నారు? తెరాసకు ఓటమి భయం పట్టుకుంది. మునుగోడులో ఓటమి తెరాసకు కళ్ల ముందు కనిపించింది. ఆ ఓటమి అర్థమయ్యే కొత్త నాటకానికి తెరలేపారు.

దుబ్బాకలో కూడా ఇలాంటి నాటకాలే..

సీఎం పదవి ఊడుతుందని కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తెరాస నీతి మాటలు చెప్పడం హాస్యా్స్పదంగా ఉంది. మంత్రి హత్యాయత్నం వ్యవహారంలో కూడా భాజపాపై ఆరోపణలు చేశారు. మునుగోడు నాయకులకు ఫోన్‌ చేసి తెరాసలో చేరమని కేటీఆర్‌ ఫోన్‌ చేయలేదా? దుబ్బాకలో కూడా ఇలాంటి నాటకాలే ఆడారు. మునుగోడులోనూ అలాంటి సీన్ పునరావృతం అయింది. పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు వేలాది మంది భాజపా కార్యకర్తలకు తాయిలాల ఆశ చూపించి తెరాసలో చేర్చుకోలేదా?పార్టీ ఫిరాయింపుల ప్రకారం కేసులు పెట్టాలంటే ముందుగా కేసీఆర్‌పైనే పెట్టాలి. నలుగురు ఎమ్మెల్యేలు రావడం వల్ల మాకు ఒరిగేదేమీ ఉండదు. ఫాంహౌస్‌లో పట్టుబడ్డవారు భాజపా వాళ్లని ముద్ర వేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెరాసకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలి. విఠలాచార్య సినిమాలా కేసీఆర్‌ తీరు ఉంది. ఆయన ఆడిన నాటకం అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుంది.

ఉప ఎన్నిక కోసం ఇంత చిల్లర రాజకీయం అవసరమా?

రాజకీయ దురుద్దేశంతోనే సీబీఐ దాడులు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. సానుభూతి పొందేందుకు సీఎం కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ పార్టీ మారాలంటే మారొచ్చు.. అదేం పెద్ద నేరం కాదు. తెరాస నాయకత్వం భాజపాకు అవసరం లేదు. ముఖ్యమంత్రిలా మాకు ఫాంహౌస్‌లు లేవు. వందలాది ఆర్టీసీ బస్సుల్లో మద్యం సరఫరా చేస్తున్న నీచ చరిత్ర తెరాసది. ఉపఎన్నిక కోసం ఇంత చిల్లర రాజకీయం అవసరమా? సీఎం పదవి హుందాతనాన్ని కేసీఆర్‌ దిగజారుస్తున్నారు. ప్రధానిని తిడితే దేశ్‌ కీ నేత అవుతారా? పోలీసులు రాకముందే తెరాస సోషల్ మీడియా గ్రాఫిక్స్‌ తయారు చేసి పెట్టుకుంది. నిత్యం భూకబ్జాలు చేసే మీరా మమ్మల్ని విమర్శించేది? పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం సీట్లలో తెరాస ఓడిపోయింది. తెరాస పనైపోయిందనే ఇప్పుడిలా కొత్త నాటకాలకు తెర తీసింది. మధ్యవర్తుల అవసరం లేకుండానే మా పార్టీలోకి రావొచ్చు. వినాశకాలే విపరీతబుద్ధి అని తెరాస గ్రహించాలి’’ అని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని