Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి

అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(kotamreddy) అన్నారు. ఆఖరి దాకా పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు తాను మోసం చేయలేదని చెప్పారు. 

Updated : 03 Feb 2023 12:36 IST

నెల్లూరు: అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (kotamreddy) అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. 

ఆధారం దొరికాక దూరం జరిగా..

‘‘అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాడిని. నా మనసు విరిగింది. ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్‌ ప్రభుత్వంలో నా ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చా. ఆఖరిదాకా ఉండి మోసం చేయలేదు. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగా.

దాదాపు 10 మంది మంత్రులు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంంతోనే నా వద్ద ఉన్న ఆధారం బయటపెట్టా. ట్యాపింగ్‌పై విచారణ జరపండి అని కోరా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేది.. ప్రజలు ఆమోదించేవారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆషామాషీగా జరగదు.

చంద్రబాబును కలవలేదు

ట్యాపింగ్ అధికారుల పనికాదు.. ప్రభుత్వ పెద్దల పనే. సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు, సలహాదారులు నాపై మూకుమ్మడి దాడి చేయడం దారుణం. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ వ్యాఖ్యలు బాధించాయి. నా బిడ్డలు ఏం చేశారు.. వారిపై విమర్శలెందుకు?డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాను. ఆరోజు చంద్రబాబును కలిశానన్నది అసత్యం.

సజ్జలది అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉండే పరిజ్ఞానం..

తప్పుడు ఆరోపణలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు వదులుతున్నారు. కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉండే పరిజ్ఞానం సజ్జలకు ఉంది. థియేటర్‌ యజమానుల నుంచి నెలకు రూ.2లక్షలు వసూలు చేస్తున్నానన్నది విష ప్రచారమే. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి. శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్‌ చేయించండి. అప్పుడే నా గొంతు ఆగుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది ’’ అని కోటంరెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని