Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్‌ వస్తే మీకు వీడియో కాల్స్‌ వస్తాయ్‌: కోటంరెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి కోటంరెడ్డి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కాకాణి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated : 04 Feb 2023 15:04 IST

నెల్లూరు: అధికార వైకాపా నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో.. మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకున్నట్లు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరులో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తనపై మంత్రి కాకాణి చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

‘‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా వీర విధేయుడు కాదు.. వేరే వాళ్లకు విధేయుడని మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజం. నేను కష్టాల్లో నడిచిన వ్యక్తిని. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప పక్కదారులు చూసే మనిషిని కాదు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? మరి మిమ్మల్ని (కాకాణి) జడ్పీ ఛైర్మన్‌ చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు? ఓదార్పు యాత్ర సమయంలో పొదలకూరులో వైఎస్‌ విగ్రహం పెట్టకుండా మీరు అడ్డుకోలేదా? వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ఎందుకు అడ్డుకున్నారు కాకాణి? విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే నాకు చాలా జాలేస్తోంది. నన్ను తిడితే వైకాపా ప్రభుత్వంలో పదవులు వస్తాయనుకొని వరుస విమర్శలు చేస్తున్నారు. వైకాపాలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా?  నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసులో కాకాణిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నా’’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘మంత్రి పదవిని ఇప్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే ఆయనకు కోపం వచ్చినట్లుంది. నాకు బెదిరింపు కాల్స్‌ వచ్చినా భయపడకుండా అంతా వింటున్నా. రికార్డు చేస్తున్నారని తెలిసినా మాట్లాడా.. నేను భయపడలేదు. నన్ను, నా తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని ఎవరో కడప నుంచి అనిల్‌ అనే వ్యక్తితో ఫోన్‌ చేయించారు. సజ్జల కోటరీ నుంచే ఆ వ్యక్తి మాట్లాడినట్లు తెలిసింది. ఎవరో వ్యక్తితో మాట్లాడించిన సజ్జలకు నేను చెప్పేది ఒక్కటే. నేను అలాంటి వ్యక్తిని కాదు. అలాంటి ఫోన్‌ కాల్స్‌ నాకొస్తే.. నెల్లూరు రూరల్‌ నుంచి వీడియో కాల్స్‌ మీకొస్తాయని సజ్జల గుర్తు పెట్టుకోవాలి. నాపై కిడ్నాప్‌ కేసు పెట్టారు. అవసరమైతే హత్యాయత్నం కేసు కూడా పెట్టుకోండి. సలహాదారుగా ప్రభుత్వ పనులను మాసేసి ఆపరేషన్‌ నెల్లూరు రూరల్‌ అనే విధంగా సజ్జల వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలి. ఇలా ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదు. నేను భయపడతానని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది’’ అని కోటంరెడ్డి హెచ్చరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు