KTR: అబద్ధాల బాద్‌షా.. తెలంగాణకు పనికొచ్చేమాట ఒక్కటీ లేదు: కేటీఆర్‌

తుక్కుగూడలో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 15 May 2022 17:43 IST

హైదరాబాద్‌: తుక్కుగూడలో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ఆయన అమిత్‌షా కాదని.. అబద్ధాల బాద్‌షా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఆ విధంగా పేరు మార్చుకోవాలన్నారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ అమిత్‌షా చేసిన విమర్శలను తిప్పికొట్టారు.  
డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే వచ్చే సౌండ్‌లా తప్ప.. తెలంగాణకు పనికొచ్చే మాట ఒక్కటీ అమిత్‌షా ప్రసంగంలో లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో చెప్పిన తుప్పు మాటలను విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నిజానికి భాజపాకు క్షేత్రస్థాయిలో బలం లేదని.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తే 108 చోట్ల భాజపాకు డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పారు. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా చేశారని.. వాట్సాప్‌ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నాలు చేశారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, నీతిహీనులు..

‘‘సీఎం పదవి కావాలంటే రూ.2500కోట్లు ఇవ్వాలంటూ భాజపా అధిష్ఠానం తనను అడిగిందంటూ కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందిన భాజపా ఎమ్మెల్యే పాటిల్‌ యాత్నాల్‌ చెప్పారు. ఈ విషయం నేను చెబుతోంది కాదు. పత్రికల్లో కూడా వచ్చింది. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలను భాజపా నుంచి ఎవరూ ఖండించలేదు.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతవరకు ఆయన సస్పెండ్‌ కూడా కాలేదు. వాళ్లు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, నీతిహీనులు. కర్ణాటకలో 30 శాతం కమీషన్‌ ఇవ్వనిదే ఎండోమెంట్‌ నిధులు కూడా రావని ఓ హిందూ మఠాధిపతి చెప్పారు. 40 శాతం కమీషన్లు ఇస్తే తప్ప బిల్లులు రావంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వినేవాళ్లు ఏమనుకుంటున్నారోననే సోయి కూడా లేకుండా నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి ఏదో షో చేసి పోతామంటే కుదరదు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ.

నిజాలు చెప్పమంటే నిజాం గురించి మాట్లాడుతున్నారు!

ఈ 8 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండని అమిత్‌షా మేం కోరాం. వాటి గురించి నిజాలు చెప్పమంటే ఆయన నిజాం గురించి మాట్లాడుతున్నారు. భాజపా వాళ్లు తలచుకున్నంతగా నిజాంను ఆయన వారసులు కూడా తలచుకోరేమో! మాట్లాడితే నిజాం, రజాకార్లు.. ఇవి తప్ప తెలంగాణకు పనికొచ్చే ముచ్చట ఒక్కటైనా చెప్పారా?తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65లక్షల కోట్లు చెల్లిస్తే.. తిరిగి వచ్చింది కేవలం రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినట్లే తెలంగాణకు కూడా ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. 

భాజపా స్టీరింగ్‌ రెండు కార్పొరేట్‌ కంపెనీల చేతిలో..

డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ లేదు.. మంచినీరు లేదు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇచ్చారు. అక్కడ 5 నెలల్లో 4 సార్లు విద్యుత్‌ఛార్జీలు పెంచారు. సామాన్యుల వద్ద మోదీ రూ.26.50లక్షల కోట్లు దోపిడీ చేశారు. మోదీ మిత్రులకు మాత్రం రూ.11లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. రైతుబంధు ఎప్పుడొచ్చింది? పీఎం కిసాన్‌ ఎప్పుడొచ్చింది? పీఎం కిసాన్‌ కింద కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారా? ప్రపంచంలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర అధికంగా ఉండే దేశం భారత్‌. దేశంలో గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని ద్రవ్యోల్బణం ఇప్పుడు ఉంది. భారత్‌ మరో శ్రీలంక కానుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మిన భాజపా.. ఇప్పుడు ఉద్యోగాలపై మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వంలో 8.50లక్షల ఖాళీలున్నాయని కేంద్రమంత్రి చెప్పారు. 60 ఏళ్లలో కేంద్రం చేసిన అప్పులను.. మోదీ 8 ఏళ్లలోనే చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.26.50లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. భాజపా స్టీరింగ్‌ రెండు కార్పొరేట్‌ కంపెనీల చేతిలో ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు’’ అని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని