KTR: విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి: కేటీఆర్‌

తెలంగాణలో ఆ రోజుల్లో రెడ్‌టేప్‌ ప్రభుత్వం ఉంటే.. ఇవాళ రెడ్‌కార్పెట్‌ సర్కారు ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు.

Updated : 08 Jun 2023 19:06 IST

మెట్టుగడ్డ: తెలంగాణలో ఆ రోజుల్లో రెడ్‌టేప్‌ ప్రభుత్వం ఉంటే.. ఇవాళ రెడ్‌కార్పెట్‌ సర్కారు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మనుషులందరికీ భగవంతుడు ఒకేలా తెలివితేటలు ఇచ్చాడు. ఇవాళ గురుకుల పాఠశాలల నుంచి ఐఐఎం, ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగాలను యువత అందిపుచ్చుకోవాలి. విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. అలా అందిపుచ్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. నైపుణ్యాలు ఉన్నా భయం వల్ల అనేక మంది విద్యార్థులు ఆగిపోతున్నారు. ఇవాళ ఏదైనా సందేహం వస్తే గూగుల్‌ను అడుగుతున్నాం. విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం.

తెలంగాణ ఏం సాధించిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నాం. రూ.56వేల కోట్ల వద్ద ఉన్న ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు చేరడం వాస్తవం కాదా. ఇవి నా లెక్కలు కావు. నాలుగు రేట్లు ఐటీ ఎగుమతులు పెరిగాయి. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇవాళ 9.05 లక్షలకు చేరింది. హైదరాబాద్‌ మారిందని స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ చెప్పారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే హైదరాబాద్‌లో ఉన్నామా.. లేక న్యయార్క్‌లో ఉన్నామా అనేలా ఉందన్నారు. 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం, 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలు కాదా? 9 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్లామో ప్రజలు చూస్తున్నారు. విద్య, వైద్యం.. ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాం. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు మారాయా? లేదా? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు