AP Politics: అధికార ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలు.. కుప్పంలో రాజకీయ రగడ

అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలతో కుప్పం పురపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్‌ను ఆ పార్టీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ సోదరుడు ఫిర్యాదు చేయడం, తానేమీ అపహరణకు గురికాలేదని..

Published : 08 Nov 2021 15:59 IST

చిత్తూరు: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలతో కుప్పం పురపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్‌ను ఆ పార్టీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ సోదరుడు ఫిర్యాదు చేయడం, తానేమీ అపహరణకు గురికాలేదని ప్రకాశ్‌ ప్రకటించడం ఎన్నికల వేడిని మరింత రాజేశాయి.

నాటకీయ పరిణామాలు

నామినేషన్ల చివరి రోజు తెదేపా నుంచి పోటీ చేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చించేసిన ఘటన మొదలు.. బరిలో ఉన్న అభ్యర్థిని కిడ్నాప్‌ చేశారంటూ అదే పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడం వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 14వ వార్డు నుంచి తెదేపా అభ్యర్థులుగా వెంటకేశ్‌, ప్రకాశ్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. వెంకటేశ్‌ పత్రాలు తిరస్కరణకు గురవ్వగా.. ప్రకాశ్‌ పోటీలో ఉన్నారు. ప్రకాశ్‌తోపాటు కుటుంబ సభ్యులను తెదేపా నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ప్రకాశ్‌ అన్న గోవింద రాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయం గోవిందరాజు ఫిర్యాదు చేయగా.. సాయంత్రం తాము కిడ్నాప్‌కు గురికాలేదంటూ.. ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేశారు.

వైకాపా ఎత్తుగడ

ప్రకాశ్‌ కిడ్నాప్‌ వ్యవహారం వైకాపా రాజకీయ ఎత్తుగడలో భాగమని తెదేపా నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థులను తామే కిడ్నాప్‌ చేశామంటూ ఫిర్యాదు చేస్తూ సరికొత్త ఆటకు తెరతీశారని ఆక్షేపించారు. తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టేందుకు వైకాపా యత్నిస్తోందని ఆరోపించారు. కుప్పం పురపాలక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స్థానికంగా నేతలు మకాం వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని