
బండి సంజయ్ ఫిర్యాదు.. సీఎస్ సహా పలువురికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
హైదరాబాద్: భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్, ముఖ్య కార్యదర్శికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్లకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
బండి సంజయ్పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. నిన్న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్లో జరిగిన ఘటన వివరాలను తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని.. పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి వివరించారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.