సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: లోకేశ్‌

రాష్ట్ర పరిధిలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు

Published : 06 May 2021 01:22 IST

అమరావతి: రాష్ట్ర పరిధిలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు లోకేశ్ లేఖ రాశారు. మే నెలలో ఆఫ్‌లైన్‌లో జరిగే పరీక్షలను కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీలో బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసినందుకు సీఎం జగన్‌కు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మే నెలలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాలల సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌, పోటీ పరీక్షలు జరగాల్సి ఉందని లోకేశ్‌ తన లేఖలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటడం లేదన్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో పాటు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో రోగులు చనిపోతున్న ఘటనలు తెలియనివి కావన్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే జూన్‌ మొదటి వారంలో పరిస్థితులపై సమీక్షించి అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని