Karnataka Elections: మేం గెలిస్తే.. సీఎం ఎవరో డిసైడ్‌ చేసేది వాళ్లే: డీకే శివకుమార్‌

Karnataka Elections: ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం కొనసాగనున్న వేళ కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం పీఠంపై ఎవరు ఉండాలనే అంశాన్ని నిర్ణయించేది మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీలేనన్నారు.

Published : 12 May 2023 20:19 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయంటూ భారీ అంచనాలు కొనసాగుతున్న వేళ సీఎం ఎవరు అవుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. దీనిపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీయే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిద్ధరామయ్య, తాను సీఎం పీఠం కోసం పోటీపడుతున్నట్టుగా ఇటీవల వార్తలు రావడంతో మరోసారి ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ వ్యవహారంలో నిర్ణయం ఆ ముగ్గురిదే (ఖర్గే, సోనియా, రాహుల్‌) అని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కుతుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై తనకు నమ్మకం లేదన్న ఆయన.. తాము 141 సీట్లలో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఏజెన్సీల కన్నా.. తమ సర్వేలో సేకరించిన శాంపిల్స్‌ సంఖ్య అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిమూలకూ వెళ్లానన్నారు. ఎన్ని సీట్లు వచ్చిన దానితో సంబంధంలేకుండా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసేది మాత్రం తామేనంటూ భాజపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అది వారి భ్రమమాత్రమేనని డీకేఎస్‌ అన్నారు. ఇంకోవైపు, 224 స్థానాలకు ఈ నెల 10న ఎన్నికల పోలింగ్ జరగ్గా.. శనివారం (13న) ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

భాజపా, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌), ఇంకా ఇతర అభ్యర్థులు శనివారం వెల్లడికానున్న ఫలితాల కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాయి. శనివారంతో వారి భవితవ్యం వెల్లడికానుంది. ఇక ఈ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాల సరళిపై ఓ స్పష్టత వస్తుంది. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది ముందు జరిగిన ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృత ప్రచారం నిర్వహించాయి. 224 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని