పెట్రో ధరలకు కళ్లెం వేయండి.. మోదీకి దీదీ లేఖ

నిత్యం పెరుగుతున్న చమురు ధరలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్న....

Published : 06 Jul 2021 01:03 IST

కోల్‌కతా: నిత్యం పెరుగుతున్న చమురు ధరలపై పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె సోమవారం లేఖ రాశారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద రూపాయలు దాటాయని పేర్కొన్నారు. ధరల పెంపు వల్ల సామాన్యులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

కరోనా వేళా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో కేంద్ర ప్రభుత్వం ₹3.71 లక్షల కోట్ల మేర చమురు ఉత్పత్తులపై ఆర్జించిందని లేఖలో మమతా బెనర్జీ ప్రస్తావించారు. 2014-15తో పోలిస్తే కేంద్రం పన్ను వసూళ్ల ఆదాయం 370 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అలాగే సెస్సులు పెంచుతూ రాష్ట్రాల దక్కాల్సిన 42 శాతం వాటాకు కేంద్రం గండి కొడుతోందని విమర్శించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఇలాంటి ధోరణులను వీడాలని హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తమ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కొంత రిబేట్‌ ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్రం సైతం పన్నులను గణనీయంగా తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించాలని, ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని