ఈ ఎన్నికలో దీదీకి ఓటమి తప్పదు: సువెందు

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠగా మారిన నందిగ్రామ్‌ పోరులో సీఎం మమతా బెనర్జీకి ఓటమి తప్పదని భాజపా నేత సువెందు అధికారి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నందిగ్రామ్‌లో రెండో దశ ఎన్నికల్లో

Published : 01 Apr 2021 10:30 IST

కోల్‌కతా: నందిగ్రామ్‌ పోరులో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఓటమి తప్పదని భాజపా నేత సువెందు అధికారి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానిక నందనాయక్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రానికి ద్విచక్రవాహనంపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

‘నందిగ్రామ్‌ స్థానంలో నాపై పోటీ చేస్తున్న అధికార టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీకి పరాజయం తప్పదు. ఈ ప్రాంత ప్రజలతో నాది ఏళ్ల నాటి అనుబంధం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి వ్యక్తితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. తప్పకుండా ఈ ఎన్నికలో నేను విజయం సాధిస్తా. గ్రామీణ ప్రజలంతా భాజపాకే ఓటు వేయడానికి కదిలొస్తున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రస్తుతానికి పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని సమాచారం అందింది. టీఎంసీ అన్ని బూతుల్లో ఏజెంట్లను నియమించుకోవడంలోనే విఫలమైంది. దీదీ ఓటమి పాలవుతారనడానికి అదే ఉదాహరణ’ అని సువెందు వెల్లడించారు. 

బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. అసోంలో 39 స్థానాలకు, బెంగాల్‌లో 30 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. అసోంలో 345 మంది అభ్యర్థులు, బెంగాల్‌లో 171 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని