Marri Shashidhar Reddy: ‘కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎప్పుడూ ఊహించలేదు..అందుకే రాజీనామా’

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. చాలా బాధతో రాజీనామా చేశానని.. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు.

Updated : 22 Nov 2022 19:23 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. చాలా బాధతో రాజీనామా చేశానని.. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు. త్వరలోనే తాను భాజపాలో చేరనున్నట్లు స్పష్టం చేశారు.

ఇటీవల దిల్లీలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడం, కాంగ్రెస్‌ పార్టీకి క్యాన్సర్‌ సోకిందంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. అనంతరం శశిధర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు.

తెరాసతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌..

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని శశిధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెరాసతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు.

పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా పార్టీ ఇన్‌ఛార్జ్‌లు

‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చాం. అయినా ఆయన్ను ఆరేళ్ల పాటు కొనసాగించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలి. తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ వారు పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌లో డబ్బు ఇచ్చే వాళ్ల మాటే చెల్లుతుంది’’అని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని