Mayawati: యూపీలో బీఎస్పీ ఒంటరి పోరు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చల....

Published : 27 Jun 2021 11:35 IST

పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టీకరణ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చలు జరుపుతోందని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు.

యూపీలో మాజీ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ), హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎంతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ పేరిట మాయావతి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై వచ్చే నెల ఓవైసీ లఖ్‌నవూ వెళ్లనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాయావతి నుంచి తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌ మినహా వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరాఖండ్‌లోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి స్పష్టం చేశారు.

ఒకప్పుడు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది. అలాగే పార్టీలో సీనియర్‌ నాయకులు లాల్‌జీ వర్మ, రామచల్‌ రాజభర్‌ పార్టీ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మాయావతికి అత్యంత సన్నిహితుడు సతీష్‌ చంద్ర మిశ్రా సైతం పార్టీలో విభేదాలకు కారణమవుతున్నట్లు సమాచారం. గత రెండేళ్లలో పార్టీని వీడిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు మిశ్రా వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆయనే మాయావతిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దళిత ఓటర్లలో మంచి పట్టున్న బీఎస్పీకి రానున్న ఎన్నికలు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఎస్పీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని