Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 01 Apr 2023 16:51 IST

అమరావతి: మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని బొత్స ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది తన అభిప్రాయమన్నారు.  న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ‘‘ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానం అన్నా. నివాసయోగ్యమైనందున అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం’’ అని బొత్స తెలిపారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించనన్నారు. ముందుస్తు ఎన్నికలపై బొత్స స్పందిస్తూ.. ఐదేళ్లు ప్రజలు పాలించాలని అవకాశమిచ్చారని.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తాం? అని బొత్స ప్రశ్నించారు. 

ఆ ఓటమిని నా వైఫల్యంగా భావిస్తున్నా..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా ఓటమిపైనా బొత్స స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడం తన వైఫల్యంగానే భావిస్తున్నానని చెప్పారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని