KTR: తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్‌

తెలంగాణ ఏర్పాటైతే భూముల ధరలు తగ్గిపోతాయని గతంలో అపోహలు సృష్టించారని, కానీ, హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లోనూ భూముల ధరలు పెరిగాయని కేటీఆర్‌ అన్నారు.

Published : 25 Mar 2023 19:10 IST

హైదరాబాద్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడే నిజమైన నాయకుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్దఅంబర్‌పేటలో నిర్వహించిన ‘భారాస ప్రగతి నివేదన సభ’లో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే పరిపాలన పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందన్నారు. స్వచ్ఛ గ్రామాలు, ఉత్తమ మున్సిపాలిటీ కేటగిరీల్లో రాష్ట్రానికి అధిక అవార్డులు వచ్చినట్లు గుర్తు చేశారు.

‘‘ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.10 లక్షలకు పెరిగింది. ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలోని కొంగర్‌కలాన్‌లో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని అప్పటి నాయకులు అపోహలు సృష్టించారు. ఇప్పుడు హైదరాబాద్‌, పరిసర జిల్లాలు, ఇతర జిల్లాల్లో భూముల ధరలు పెరిగాయి.’’ అని కేటీఆర్‌ అన్నారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గంలో 3 వేల కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు.

జన్‌ధన్‌ ఖాతాల్లో మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడికి పోయాయని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకవ్వడం వాస్తవమేనన్న కేటీఆర్‌.. అందుకే అప్పటికే పూర్తయిన పరీక్షలను రద్దు చేశామని కేటీఆర్‌ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి 63 రోజులపాటు 95 గ్రామాల మీదుగా 775 కి.మీ పాదయాత్ర చేశారు. ముగింపు సభకు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని