Anam: వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 04 Jun 2023 18:22 IST

నెల్లూరు: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విమర్శించారు. వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించటానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

‘‘40 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఇలాంటి నిర్వీర్యమైన పాలన ఎప్పుడూ చూడలేదు. అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. ప్రజల అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. జిల్లా స్థాయి సమావేశాలకు విలువలేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన వారు ఇద్దరే.. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు. గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచ్‌కి కూడా అధికారం లేదు. వాలంటీరుకు ఉన్న అధికారం ఎమ్మెల్యేకు లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదు. ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదొక్కటే. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ ఇదే. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? పరిశ్రమను తీసుకొచ్చారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టును నిలిపేసి.. కట్టలేమనే స్థితికి వచ్చారు. పవర్‌ ప్రాజెక్టులు అమ్మే పరిస్థితికొచ్చారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు’’ అని రామనారాయణరెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని