MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా.. వ్యయ పరిమితి నిబంధన లేదు: సీఈవో వికాస్‌రాజ్‌

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పూర్తయినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 23న జాబితా ప్రకటించి పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) పంపిస్తామని వెల్లడించారు.

Updated : 13 Feb 2023 21:44 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి అయిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో ఓటర్ల నమోదు పూర్తయినట్లు చెప్పారు. డిసెంబర్‌ 31, 2022 నాటికి ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య 29,501గా ఉందన్నారు. కొత్తగా 1,331 ఓటు హక్కు దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 23న జాబితా ప్రకటించి పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) పంపిస్తామని వెల్లడించారు. గతంలో తిరస్కరించిన 1,440 దరఖాస్తుల్లో 788 సరైనవేనని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌తో 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటా, వ్యయ పరిమితి నిబంధన లేదన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని