తేజస్వీ ముందు మోదీ, నితీశ్‌ నిలువలేరు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. యూఎస్‌లో ట్రంప్‌ ఓటమిపాలైనట్లుగా బిహార్‌లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌ కూడా గద్దెదిగడం తప్పదని అంటోంది

Updated : 09 Nov 2020 13:35 IST

బిహార్‌లోనూ అమెరికా తరహా ఫలితమే: శివసేన 

ముంబయి: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. యూఎస్‌లో ట్రంప్‌ ఓటమిపాలైనట్లుగా బిహార్‌లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌ కూడా గద్దెదిగడం తప్పదని అంటోంది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ట్రంప్‌ ఓటమి నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలని చెప్పిన శివసేన.. తేజస్వీ యాదవ్‌ లాంటి యువనేత ముందు మోదీ, నితీశ్‌ లాంటివారు కూడా నిలువలేరంటూ ఎన్డీయే కూటమిపై విమర్శలు గుప్పించింది. 

‘‘అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ ఎప్పుడూ అర్హుడు కారు. నాలుగేళ్ల క్రితం తాము చేసిన తప్పిదాన్ని అమెరికన్లు నేడు సరిదిద్దుకున్నారు. ఈ నాలుగేళ్లలో ట్రంప్‌ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకే ఆయనను గద్దె దించారు. ట్రంప్‌ ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. ఏదేమైనా అమెరికాలో అధికార మార్పు జరిగింది. బిహార్‌లో కూడా అదే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే ఓడిపోతుందని స్పష్టమవుతోంది. ‘మేము తప్ప ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేదు’ అని భ్రమలో ఉన్న నాయకుల్ని(ఎన్డీయే నేతలను ఉద్దేశిస్తూ) తొలగించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. తేజస్వీ యాదవ్‌ లాంటి యువనేత ముందు మోదీ, నితీశ్‌ కుమార్‌ లాంటివారు కూడా నిలువలేరు’’ అని సామ్నా తమ సంపాదకీయంలో పేర్కొంది.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ శివసేన ఎన్డీయేపై విమర్శలు గుప్పించింది. భారత్‌ ‘నమస్తే ట్రంప్‌’ అంటే అమెరికన్లు మాత్రం ఆయనకు బై బై చెప్పారని ఎద్దేవా చేసింది.

శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. బిహార్‌కు తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా మహాకూటమివైపే మొగ్గుచూపుతున్నాయి. మరి బిహార్‌ పీఠం ఎవరికి దక్కుతుందో.. నితీశ్‌ భవితవ్యం ఏంటో మంగళవారం తేలుతుంది. రేపు బిహార్‌ ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని