మోదీ.. దేశంలోనే అగ్రనాయకుడు: సంజయ్‌

ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం...

Published : 11 Jun 2021 01:48 IST

దిల్లీ: ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశంసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం చాలా అరుదు. అయితే.. తౌక్టే తుపాను పరిహారం నిధులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘‘గత ఏడేళ్లలో భాజపా విజయానికి మోదీయే కారణం. దేశంలో ప్రస్తుతం ఆయనే అగ్రనాయకుడు. భాజపాయే అగ్ర పార్టీ. ఈ విషయాన్ని నేను ఏ మీడియా రిపోర్టుల ఆధారంగా చెప్పడం లేదు. దీనిపై అధికారికమైన ప్రకటన ఏదీ లేదు’’ అని సంజయ్‌ వెల్లడించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇమేజ్‌తోనే భాజపా అధికారంలోకి వచ్చిందని రౌత్‌ అన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవమేనని చెప్పారు. కేరళలో ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోని భాజపా.. తమిళనాడులో 4, పశ్చిమ్‌ బెంగాల్‌లో 77 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఉండేవి. అయితే రాజకీయ పరమైన విభేధాలతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన ‘మహా వికాస్‌ అఘాడీ’గా ఏర్పడి అధికారం అందుకుంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మోదీతో, ఉద్దవ్‌ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్‌ రౌత్‌ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని