గిరిజనులపై కక్ష సాధింపు హేయం: కోమటిరెడ్డి

అడవి తల్లిని నమ్ముకున్న గిరిజనులకు పోడు భూములే ఆధారమని.. ఆ భూములు సాగుచేసుకుని జీవిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజ

Published : 24 Feb 2021 01:50 IST

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎంపీ

భువనగిరి: అడవి తల్లిని నమ్ముకున్న గిరిజనులకు పోడు భూములే ఆధారమని.. ఆ భూములు సాగుచేసుకుని జీవిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌.. ఇలా అన్ని జిల్లాల్లోని తండాలు, గూడేలకు చెందిన గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేసి పంటలను సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఏడు దశాబ్దాలుగా అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం కక్ష సాధింపు హేయమైన చర్య అని ఆక్షేపించారు. అటవీపుత్రులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం.. అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖలో కోమటిరెడ్డి ఆరోపించారు. 

‘‘అసెంబ్లీ సాక్షిగా పోడుభూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మీరు హామీ ఇచ్చారు. వారికి పట్టాలు ఇస్తామని.. అటవీ హక్కు చట్టాన్ని కాపాడతానని చెప్పి ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదు. గిరిజనులకు అండగా ఉంటానన్న ప్రభుత్వమే వారిపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తోంది. ఇదేనా గిరిజనుల పట్ల మీరు ప్రవర్తించే తీరు? వారి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఇంతవరకు ఎందుకు చర్చలు జరపలేదు?’’ అని కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ సమస్యను పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. గిరిజనుల అక్రమ కేసులపై వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని