Raghurama: నన్ను చిత్రహింసలు పెట్టిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోండి.. లోక్‌సభ సభాపతికి రఘురామ వినతి

కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టిన అయిదుగురు పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

Updated : 22 Oct 2022 07:30 IST

ఈనాడు, దిల్లీ: కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టిన అయిదుగురు పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సభాపతికి లేఖ రాశారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఏపీ సీఐడీ ఏడీజీ పి.వి.సునీల్‌ కుమార్‌, డీఐజీ సునీల్‌ నాయక్‌, ఏఎస్పీ విజయ్‌ పాల్‌, ఏఎస్సై పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్‌ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలు పెట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతోనే వారు ఆ విధంగా చేశారని ఆరోపించారు. ‘పి.వి.సునీల్‌ కుమార్‌పై అనేక అవినీతి ఆరోపణలతో పాటు గృహ హింస కేసు నమోదైంది. సునీల్‌ నాయక్‌, విజయ్‌పాల్‌ ఉద్యోగ విరమణ చేసినా గత రెండేళ్లుగా ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో నన్ను సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నివేదికతో కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ ఘటనపై నేను సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కమిటీకి ఉన్న అధికారాలతో ఆ అయిదుగురిని వెంటనే పిలిపించి విచారణ చేపట్టాలి. వారిపై విచారణను ఆలస్యం చేస్తే పార్లమెంట్‌పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది...’ అని రఘురామ పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పి.వి.సునీల్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖను చర్యల నిమిత్తం కేంద్ర హోం శాఖకు పంపినట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌.రాధా చౌహాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని