ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రదే: పవార్‌

ముంబయి నగరం ఎప్పటికే మహారాష్ట్రలో భాగమేనని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవార్‌ గురువారం మీడియాతో ఈ విధంగా స్పందించారు.

Published : 29 Jan 2021 02:06 IST

ముంబయి: ముంబయి నగరం ఎప్పటికే మహారాష్ట్రలో భాగమేనని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవార్‌ గురువారం మీడియాతో ఈ విధంగా స్పందించారు. ‘ముంబయి ఎప్పటికీ మహారాష్ట్రకు చెందిన నగరమే. ఈ నగరం నిన్న, నేడు, రేపు ఎప్పటికైనా మనదే. దాన్ని ఎవరూ మార్పు చేయలేరనే విషయం అందరికీ తెలుసు. కర్ణాటక డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని పవార్‌ స్పష్టం చేశారు. 

‘కర్ణాటకలోని మరాఠీ ప్రాంతాల విలీనానికి కట్టుబడి ఉన్నామంటూ.. ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు, ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సవాడి చేసిన డిమాండుకు మధ్య ఎలాంటి పొంతన లేదు. కేవలం కర్ణాటక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఏదో చిన్న ప్రయత్నంలో భాగంగా ముంబయి పేరును వాడుకున్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి’ అని పవార్‌ విమర్శించారు. సవాడి వ్యాఖ్యలపై మహారాష్ట్ర భాజపా నాయకులు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండు చేశారు.  

ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్‌ తపసే సైతం ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం సవాడి వ్యాఖ్యలను మహారాష్ట్ర భాజపా నేతలు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర భాజపా చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్ ఈ విషయంలో తమ వైఖరి తెలపాలని డిమాండు చేశారు. 

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి స్పందిస్తూ.. ‘మా రాష్ట్రంలోని కొందరు ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందిన వారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి. అప్పటి వరకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని సవాడి దీటుగా బదులిచ్చారు. అంతేకాకుండా సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి

ముంబయిపై మాకూ హక్కుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు