
ANDHRA PRADESH : ప్రహసనంలా జిల్లాల పునర్విభజన ప్రక్రియ: నక్కా ఆనందబాబు
గుంటూరు: జిల్లాల పునర్విభజన ప్రక్రియ అంతా ప్రహసనంలా తయారైందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత నక్కా ఆనంద్బాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికే జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా జిల్లా విభజన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఎక్కడా సమస్యలు రాకుండా జిల్లాల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల కోసం కాకుండా కులాలు, మతాల మధ్య అలజడులు, విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకోవడానికే చేసినట్టు ఉందని విమర్శించారు. వేమూరు నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా తెనాలి ప్రాంతంతో ముడిపడి ఉందన్నారు. ఏవైనా పనుల కోసం రోజూ వేమూరు ప్రజలు తెనాలి ప్రాంతానికే వస్తుంటారని పేర్కొన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన చెప్పి ఇక్కడ ప్రజలను కనీసం సంప్రదించకుండా బాపట్లలో కలపడం ఏంటని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.
గురజాల రెవెన్యూ డివిజన్లో కలపడంపై అభ్యంతరం
జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్లో కలపడంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు అందించారు. పెదకూరపాడు నియోజకవర్గం ఇప్పటి వరకు గుంటూరు డివిజన్లో ఉందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం గ్రామాలకు వంద కి.మీ దూరం ఉంటుందని చెప్పారు. జిల్లాల ఏర్పాటు ప్రజల సౌకర్యార్థం ఉండాలని తెలిపారు. పెద్దకూరపాడు నియోజకవర్గాన్ని గుంటూరు డివిజన్లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలను కలిపి నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం కోసం పెదకూరపాడు నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లాలో కలపాలని విన్నవించారు.
Advertisement