YS Sharmila: వైఎస్‌ షర్మిలకు బెయిల్‌ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. షర్మిలతో పాటు మరో ఆరుగురు  నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

Updated : 30 Nov 2022 00:32 IST

హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.  ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. ఈక్రమంలో జరిగిన ఘటనకు సంబంధించి.. షర్మిలతో పాటు మరో ఆరుగురు వైతెపా నేతలపై  గుమిగూడటం, అక్రమ నిర్బంధం, పరుష పదజాలం, పబ్లిక్‌ న్యూసెన్స్‌, బెదిరింపు, మహిళలను దూషించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంపై  ఐపీసీ 143, 341, 290, 506, 509, 353, 149 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. 

షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని అమె తరఫు న్యాయవాదులు వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే  అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు అరెస్టు చేసిన తీరును తప్పుబట్టారు. పోలీసు విధులకు ఎక్కడా ఆటంకం కలిగించలేదని తెలిపారు. శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదముందనే అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో రిమాండ్‌ విధించకపోతే లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వచ్చే అవకాశముందని వాదించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించారని, పోలీసు అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దాదాపు 2గంటల పాటు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలతో పాటు మరో ఆరుగురు వైతెపా నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని ఆదేశించారు. బెయిల్‌ మంజూరు కావడంతో షర్మిల నాంపల్లి కోర్టు నుంచి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని