Yuvagalam-Nara Lokesh: లోకేశ్‌ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్‌ చేసిన పోలీసులు

నారా లోకేశ్‌ ప్రచార రథం మైక్‌కు అనుమతి లేదంటూ ఆ వాహనాన్ని పలమనేరు పోలీసులు సీజ్‌ చేశారు. దీన్ని నిరసిస్తూ లోకేశ్‌ రోడ్డుపైనే బైఠాయించారు.

Updated : 02 Feb 2023 20:08 IST

ఏ చట్టంతో సీజ్‌ చేశారని నిలదీసిన యువనేత

పలమనేరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్‌ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. 

లోకేశ్‌ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. పాదయాత్రలో మైక్‌కు అనుమతి లేదని.. అందుకే సీజ్‌ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రచార రథాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్‌ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్‌ చేశారని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పారు. లోకేశ్‌ నిరసన తర్వాత పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టడంతో ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని