Nara Lokesh: ‘యువగళం’ పేరిట నారా లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు.

Updated : 28 Dec 2022 12:40 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 27 నుంచి లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను తెదేపా త్వరలో ప్రకటించనుంది. హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేశ్‌ సూచించారు.  

మరోవైపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైకాపా సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, నిరుద్యోగ యువత తమ సమస్యలు తెలిపేందుకు ‘యువగళం’ పాదయాత్ర వేదికగా నిలుస్తుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని