Yuvagalam Padayatra: రాయలసీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా: నారా లోకేశ్‌

యువగళం పాదయాత్రలో భాగంగా  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కడపలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు.

Updated : 07 Jun 2023 21:29 IST

కడప: యువగళం పాదయాత్రలో భాగంగా  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కడపలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ప్రొఫెసర్‌ రాజేశ్‌ చర్చా వేదికలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా’నని ప్రకటించారు. రాయలసీమలో తెదేపాకు తక్కువ సీట్లు వచ్చినా తక్కువగా చూడలేదన్న లోకేశ్‌.. మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. రాయలసీమకు పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ తెదేపా అని గుర్తు చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నేతలు అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు.  వైకాపాకు ఇచ్చినన్ని సీట్లు తెదేపాకు ఇస్తే.. చెప్పింది చేసి చూపిస్తామన్నారు. 

పరిశ్రమలకు పెద్దపీట..

సీమ జిల్లాలను ఆటో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుస్తాం. దగ్గర్లో ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్లను వినియోగించుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. పెద్ద ఎత్తున ఆటో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాయలసీమలో ఉన్న మైనింగ్‌ పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తాం. మైనింగ్‌లో కేవలం మెటీరియల్‌ ఉత్పత్తి మాత్రమే కాకుండా ఫైనల్‌ ప్రొడక్ట్‌ తయారీ వరకు వాల్యూ చైన్‌ మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. మైనింగ్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా స్కిల్డ్‌ పనులు కూడా మన రాష్ట్రం వాళ్లే చేసే విధంగా నైపుణ్య శిక్షణ ఇస్తాం. సిమెంట్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారు చేసే కంపెనీలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తాం.

రైతులకు హామీలు..

రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం. సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సహిస్తాం. 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌, వివిధ ఉద్యాన పంటలకు రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎగుమతి చేయడం, కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్‌ సెంటర్లు పనిచేస్తాయి. టొమాటో వాల్యూ చైన్‌ ఏర్పాటు చేసి.. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపీలోనే తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకు అందిస్తాం.

సీడ్‌ హబ్‌గా ఏపీని మార్చడం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. పాత బీమా పథకాన్ని అమలు చేస్తాం. రైతు బజార్ల సంఖ్య పెంచుతాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాలు అందిస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పల్పింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాయం అందిస్తాం’’ అని నారా లోకేశ్‌ ప్రకటించారు.

స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా రాయలసీమ

‘‘వాటర్‌ గ్రిడ్‌ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. పశువుల కొనుగోలు నుంచి మేత, మందుల వరకు రాయితీ అందజేస్తాం. గొర్రెలు, మేకల పెంపకానికి ప్రత్యేక సాయం ఇస్తాం. ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమం చేపడుతాం. పశువుల మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. ఫార్మ్స్‌ ఏర్పాటుకు రాయితీ రుణాలు అందజేస్తాం. స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతాం. అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడమే లక్ష్యంగా రాయలసీమలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని రకాల క్రీడలకు స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫెసిలిటీలు, స్టేడియాలు ఏర్పాటు చేస్తాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని