Navjot Singh Sidhu: ‘కాంగ్రెస్‌ కోరినట్లుగా..’ సిద్ధూ రాజీనామా

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు

Updated : 16 Mar 2022 12:49 IST

పార్టీ ఆదేశాలతో కొనసాగుతున్న రాజీనామాలు

అమృత్‌సర్: ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉత్తరాఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు తన పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్‌ పార్టీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కోరిన విధంగా నేను నా పదవికి రాజీనామా చేశా’’ అని ట్విటర్‌లో పేర్కొన్న సిద్ధూ.. రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. సిద్ధూ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పదవి చేపట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా పీసీసీ సారథులపై వేటు వేస్తూ నిన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఆయా రాష్ట్రాల్లో పార్టీ విభాగాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. యూపీలో అజయ్‌కుమార్‌ లల్లూ, పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, ఉత్తరాఖండ్‌లో గణేశ్‌ గోదియాల్‌, మణిపుర్‌లో ఎన్‌.లోకెన్‌సింగ్‌, గోవాలో గిరీశ చోడంకర్‌ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు.

సోనియా ఆదేశాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తరాఖండ్‌లో గణేశ్‌ గోదియాల్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. తాజాగా నేడు సిద్ధూ పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తప్పుకొన్నారు. 

ఇదిలా ఉండగా.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. ఏకంగా సీఎం సహా అనేక మంది రాజకీయ దిగ్గజాలను మట్టికరిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేసిన సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు. అయితే ఫలితాల తర్వాత సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని