Nellore: నెల్లూరులో పాదయాత్ర పూర్తికాగానే తెదేపా సభ్యత్వం తీసుకుంటా: ఆనం రాంనారాయణ రెడ్డి

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా నేతలు నెల్లూరులో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డితో సమావేశమయ్యారు.

Updated : 10 Jun 2023 12:50 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు చంద్రబాబు, ఆనం భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైకాపా నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబుతో భేటీ అనంతరం ఇవాళ ఆనం హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా నేతలు నెల్లూరులో ఆనంతో సమావేశమయ్యారు. ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, జిల్లాలోని తెదేపా సీనియర్ నేతలు, తదితరులు హాజరయ్యారు. నెల్లూరులో లోకేశ్‌ యువగళం పాదయాత్ర స్వాగత ఏర్పాట్లపై భేటీలో చర్చించారు.

తెదేపా నేతలతో భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో మొదలు కాబోతుంది. నిన్న పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడాను. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తాం. లోకేశ్‌ పాదయాత్ర నిర్వహణపై ప్రణాళిక వేశాం. అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తాం. జిల్లాలో పాదయాత్ర పూర్తికాగానే తెదేపా సభ్యత్వం తీసుకుంటా. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం’’ అని ఆనం వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం నేతలంతా ఆనంతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా-వైకాపా కార్యకర్తలు ఆనంతో సమావేశం కానున్నారు. వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం రేపు భేటీ కానున్నట్లు సమాచారం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని