లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం లేదు: శివసేన

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్రకు తగినన్ని టీకాలు సరఫరా చేయడం లేదంటూ కేంద్రంపై శివసేన పార్టీ మండిపడింది. రాష్ట్రానికి భాజపా ముఖ్యమంత్రి లేని కారణంగా ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి అని ప్రశ్నించింది.

Published : 12 Apr 2021 11:26 IST

ముంబయి: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్రకు తగినన్ని టీకాలు సరఫరా చేయడం లేదంటూ కేంద్రంపై శివసేన మండిపడింది. రాష్ట్రాన్ని భాజపా పాలించకపోయినంత మాత్రన ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం తన అధికార పత్రిక ‘సామ్నా’లో విమర్శలు చేసింది.

‘కేంద్రం మహారాష్ట్రకు తగినన్ని టీకాలు సరఫరా చేయాలి. టీకా ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్రానికి టీకాలు అందించి ఆదుకోవడం కేంద్రం విధి. రాష్ట్రానికి చెందిన భాజపా నాయకులు సైతం ఇక్కడి పరిస్థితులను దిల్లీలోని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినపుడు ఆ ఘనత వారికే దక్కుతుంది. అంతేకాకుండా, ఇక్కడి పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకునేలా.. కేంద్రం మహారాష్ట్రకు సహాయం చేయాలి’ అని సామ్నా పేర్కొంది. 

‘లాక్‌డౌన్‌ సహా కఠినమైన ఆంక్షలు విధించడం అనివార్యమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే చెప్పారు. కానీ, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుందని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ చెబుతున్నారు. ఆయన మాటల్లో వాస్తవం లేదని కాదు. కానీ, లాక్‌డౌన్‌కు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఒకవేళ ఆయన వద్ద ఏదైనా ఆలోచన ఉంటే దాన్ని మాతో పంచుకోవచ్చు’ అని శివసేన వెల్లడించింది.  

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రెండో దశ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 63,294 కేసులు నమోదు కాగా.. 349 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 5.67లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీకాల కొరత ఉందని.. కేంద్రం నుంచి తమ అవసరాలకు సరిపడా టీకాలు‌ రావడం లేదని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్‌తోపే చెబుతున్నారు. కేంద్రం మాత్రం అక్కడ సరిపడా డోసులు అందుబాటులో ఉన్నట్లు చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని