బెంగాల్‌లో రోడ్‌ షోలపై ఈసీ నిషేధం

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈసీ మరిన్ని ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం ...

Published : 23 Apr 2021 01:11 IST

బహిరంగ సభకు 500మంది మించొద్దని ఆదేశం

దిల్లీ: కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని సూచించింది. బెంగాల్‌లో ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తికాగా.. మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే రోడ్‌ షోలు, సైకిల్‌/ బైక్‌/ ఇతర వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే గనక వాటిని ఉసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బెంగాల్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈసీ ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.

రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీలు సూపర్‌స్ప్రెడర్‌ ఈవెంట్లుగా మారవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోల్‌కతా హైకోర్టు గురువారం విచారించింది. ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ ఎన్నికల సంఘం అధికారులు రేపటి విచారణలో నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని