మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్లు దాఖలు...

Updated : 21 Feb 2021 15:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులుండవని, యథాతథంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గతంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నామినేషన్లు దాఖలు చేసిన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 28 మంది వైకాపా అభ్యర్థులు, తెదేపా-17, భాజపా- 5, సీపీఐ- 3, కాంగ్రెస్-2, జనసేనకు చెందిన ఒకరు నామినేషన్‌ అనంతరం వేర్వేరు కారణాలతో మృత్యువాతపడ్డారు. ఈ స్థానాలన్నింటిలో నామినేషన్‌ వేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష

మున్సిపల్‌ ఎన్నికలపై ఈ నెల 22న తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించనున్నారు. రాష్ట్ర పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సమీక్షకు హాజరుకానున్నారు. భేటీకి అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని