Nitish Kumar: విపక్షాల భేటీకి అధ్యక్షులే రావాలి.. నీతీశ్ కుమార్‌ కండీషన్‌

Opposition Meet: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ నేతృత్వంలో ఈ నెల 12న జరగాల్సిన విపక్షాల భేటీ అనూహ్యంగా వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సమావేశానికి నీతీశ్ తాజాగా ఓ కండీషన్‌ పెట్టారు.

Published : 06 Jun 2023 00:06 IST

పట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి జరిగే విపక్షాల భేటీ (opposition meet)కి పార్టీల అధ్యక్షులు మాత్రమే రావాలని బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) స్పష్టం చేశారు. జూన్‌ 12న పట్నాలో జరగాల్సిన ఈ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై నీతీశ్ తాజాగా స్పందించారు. కాంగ్రెస్‌ (Congress), మరో పార్టీ అభ్యర్థన మేరకు ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ వంటివారు జూన్‌ 12న అందుబాటులో లేకపోవడంతో విపక్షాల భేటీని వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నీతీశ్ మాట్లాడుతూ.. ‘‘అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాత సమావేశానికి కొత్త తేదీని సూచించాలని కాంగ్రెస్‌ (Congress)ను కోరాం. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాం. అయితే పార్టీలన్నింటికీ నేనో విషయాన్ని స్పష్టంగా చెప్పా. ఈ భేటీకి పార్టీల అధ్యక్షులు మాత్రమే రావాలి. వారి తరఫున మరో వ్యక్తిని ప్రతినిధిగా పంపిస్తామంటూ కుదరదు. ఉదాహరణ.. కాంగ్రెస్‌ తమ అధ్యక్షుడిని కాకుండా మరో నేతను పంపించే అవకాశమున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దాన్ని మేం అంగీకరించబోం’’ అని నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP)ను ఎదుర్కొనేలా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు నీతీశ్ గత కొన్ని రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. విపక్షాల భేటీపై ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ బిహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశానికి ఒక ముఖ్యమంత్రిని, మరో సీనియర్‌ నేతను పంపించేందుకు ప్రణాళిక చేస్తున్నాం’’ అని తెలిపారు. దీనిపై భాజపా స్పందిస్తూ.. నీతీశ్‌ ప్రయత్నాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ‘‘రాష్ట్రంలో నీతీశ్‌తో కాంగ్రెస్‌ పొత్తులో ఉన్నప్పటికీ.. ఆయన భేటీకి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆసక్తి చూపించడం లేదు’’ అంటూ విమర్శించింది. ఈ నేపథ్యంలోనే నీతీశ్ స్పందిస్తూ.. అధ్యక్షులే రావాలంటూ కండీషన్‌ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని