తొలి రోజే విపక్షాల నిరసన గళం 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే విపక్షాలు లోక్‌సభలో నిరసన గళం వినిపించాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి .....

Published : 29 Jan 2021 23:55 IST

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే విపక్షాలు లోక్‌సభలో నిరసన గళం వినిపించాయి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతూ ఎంపీలు నినాదాలు చేశారు. ఇటీవలి కాలంలో మృతిచెందిన కేంద్రమంత్రి సురేష్‌ అంగాడి, రాజకీయ ప్రముఖులు జశ్వంత్‌ సింగ్‌, తరుణ్‌గొగొయ్‌, మోతాలీల్‌ వోరా, అహ్మద్‌ పటేల్‌, రాం విలాస్‌ పాసవాన్‌ సహా 26మందికి పార్లమెంట్‌ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపారు. శివసేన సభ్యులు తమ సీట్ల నుంచే నిలబడి నినాదాలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే, ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సంతాపం తెలిపాలని డిమాండ్‌ చేశారు.

రైతుల ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని విపక్షాలు బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి రోజు సభకు హాజరైన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. తన తోటి ఎంపీలతో కలిసి స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఎవరి సీట్లలోకి వారు వెళ్లి కూర్చోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  విపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భౌతికదూరం పాటించాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.

ప్రతిపక్షాల తీరు బాధించింది: భాజపా

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని.. ఆయన ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కొంతమంది సభ్యులు ప్రసంగం సందర్భంగా నినాదాలు చేశారని.. ఈ ఘటన చాలా బాధించిందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక కుంభకోణాలు వెలుగుచూసినప్పటికీ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని భాజపా ఏనాడూ బహిష్కరించలేదన్నారు.

ఇదీ చదవండి..

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు: రాష్ట్రపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని