Pawan kalyan: పోలవరానికి నిధులు తేలేకపోయారు.. 28 మంది ఎంపీలు ఏంచేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా

Published : 03 Feb 2022 02:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో  కేటాయింపులు కనిపించలేదంటే.. వైకాపా తరఫున ఉన్న 28 మంది ఎంపీలు (22మంది  లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు) దిల్లీలో ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడుగానీ, సంబంధిత అధికారులతో చర్చల్లో గానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా అనే సందేహం కలుగుతోందన్నారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లే. ఈ విధంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది? యమునా నదికి ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం ఈ బట్జెట్‌లో రూ.44కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులు ఇస్తోంది. సాధించడంలోనే వైకాపా ప్రభుత్వం అలసత్వం కనిపిస్తోంది. కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను.. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైకాపా ప్రభుత్వానికి, వైకాపా ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్లు లేదు. 2021 డిసెంబర్ 1 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి, 2022 ఖరీఫ్ పంటకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటే మరచిపోయింది. పునరావాసం, పరిహారం ప్రక్రియ ఇంకా 80శాతం మిగిలే ఉంది. ఇందుకోసం ఇంకా దాదాపుగా రూ.25 వేల కోట్లు అవసరం అని అంచనా ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణాలు వివిధ దశల్లోనే ఉన్నాయి.. కీలకమైన ఎర్త్ కామ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంకా మొదలుకాలేదు. పునరావాస, పరిహార ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో కూడా అంచనాలకు అందటం లేదు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని