Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్‌ కల్యాణ్‌

మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన అధికార ప్రతినిధిపై

Updated : 10 Aug 2022 16:12 IST

అమరావతి: మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన అధికార ప్రతినిధిపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని పవన్‌ తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. కానీ, స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగితే బలంగా సమాధానం చెబుతాం. మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఫోన్‌ చేసి అమర్యాదకరంగా మాట్లాడటం ఏం పద్ధతి? ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలిపారు. ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం. రెండు టీవీ ఛానెళ్లపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్యే బాలినేనికి చెప్పేది ఒక్కటే... మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి. రాజకీయాల్లో విధి విధానాలపై మాట్లాడుకుంటాం... వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదు. టీవీఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుని సమస్యకు ముగింపు పలకాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని