Pawan: భూమి, ఇసుక, మద్యం నుంచి గనుల వరకు వచ్చే ప్రతి పైసా జగన్‌ చేతిలోనే: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైకాపా రాజ్యానికి బానిసలుగా తయారయ్యారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. 

Updated : 01 Feb 2023 17:52 IST

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. వైకాపా పాలనపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘అరకులో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి.. కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లాడుతున్నారు. ఇదో విచిత్రం!. ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైకాపా రాజ్యానికి బానిసలుగా  అయిపోయారు.  భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. నిజంగా ఇదో గొప్ప కళాఖండం.!

వైకాపా ఏపీలోని పేదలను సామాన్యతతో సంతృప్తిగా ఉండేలా చేసింది. వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని డబ్బులకు అమ్ముడుపోయాయి. ఏపీలో మిడిల్‌ క్లాస్‌పై అత్యంత నిర్లక్ష్యం. వారిని టాక్స్‌ పేయింగ్‌ మూగ సేవకులుగా వైకాపా పరిగణిస్తోంది. వైకాపా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తీసుకురాగలిగినప్పుడు.. దావోస్‌ ఎవరికి కావాలి? మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్‌ సెంటర్‌, చాయ్‌ పాయింట్లను ప్రారంభించారు. ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు. ఇదో చిత్రమైన పరిణామం’’ అని పవన్‌ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని