Pawankalyan: తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం: పవన్‌ కల్యాణ్‌

తెలంగాణలో పరిమిత సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం చూపాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Updated : 24 Jan 2023 22:03 IST

నాచుపల్లి: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్‌పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజారాజ్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ పోరాటాల గడ్డ. దేశంకంటే రెండేళ్లు ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. నేను ఆశయం కోసం పోరాడుతున్నా. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో నేను లేను. తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నా. అప్పట్లో వైఎస్‌ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మీకు తెలుసు. అప్పటి కాంగ్రెస్‌ నేతల తీరు వల్లే పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి

తెలంగాణలో భాజపాతో పొత్తు ఉండదు, కానీ నా మద్దతు ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తాం. పరిమిత సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం. పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం చూపాలి. తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తా. ఇక్క డకూడా ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం. మన భావజాలానికి దగ్గరగా వస్తేనే  ఓకే.. అది భాజపా అయినా సరే. నాది కొత్త పార్టీ.. నేతలు కూడా కొత్త వారే. ఇక్కడ మైనింగ్‌ దోపిడీ జరుగుతోంది. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలి. తెలంగాణలో చిన్న పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలా? మరి ప్రజాప్రతినిధులకు ఎన్ని పరీక్షలు ఉండాలి? చాకలి ఐలమ్మ పోరాటం వల్లే జై తెలంగాణ అంటున్నాం. నేను తిట్లు తినడానికి, వీధి పోరాటాలకైనా సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో పాలన బెటర్‌. తెలంగాణ, ఏపీ సమస్యలు వేర్వేరు రెండింటినీ పోల్చలేం. ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వదిలేసినట్టుగా వదలం. ఆంధ్రాలో కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి. అది నాకు చాలా కష్టం. ఏపీలో ఉన్నవారు మామూలు వాళ్లు కాదు. సొంత బాబాయ్‌ను చంపించుకునే వాళ్లు. న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవాళ్లున్నారు. పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేవాళ్లు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఏపీలో విలువలేదు. అలాంటి నాయకత్వం ఇక్కడ లేదు.  నేను ఇక్కడ తిరిగాను కాబట్టే .. అక్కడ చెప్పుతో కొడతాను అన్నాను. ఏపీలో నేను ఏ సాధించినా అక్కడి స్ఫూర్తితోనే. తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని